23–09–2019
హైదరాబాద్
హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావుతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డి చర్చలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావుతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమావేశమయ్యారు. ఈ సాయంత్రం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఇరువురు ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రగతిభవన్కు ఏపీ ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఏపీ ముఖ్యమంత్రి వెంట వైయస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఉన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం శ్రీ వైయస్.జగన్ , తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావును ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆయనకు అందించారు. తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక అంశాలపై చర్చించారు. కృష్ణా డెల్టా, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను తీర్చడానికి గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలింపుపై ఇదివరకే ఇరురాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. దీనిపై మరోసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు. దీంతోపాటు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపైకూడా దృష్టిపెట్టారు.