త్వరలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తాం : హోంమంత్రి

త్వరలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తాం : హోంమంత్రి
అమరావతి : పోలీస్‌శాఖలోని సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీ, జైలు వార్డన్స్‌ కానిస్టేబుళ్ల ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. మొత్తం 2623 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవగా, అందులో 500 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం త్వరలోనే భారీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టి పోలీస్‌ శాఖలో ఉన్న ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్‌శాఖలో అమలు చేస్తున్న వీక్లీఆఫ్‌ వలన కొత్తగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించామని తెలిపారు.
ఎస్సై ఫిర్యాదు చేస్తే చర్యలు : పల్నాడు ఘటనపై స్పందించిన సుచరిత... టీడీపీ స్వార్థ రాజకీయాలు పల్నాడులో పని చేయలేదని విమర్శించారు. టీడీపీ చేపట్టదలిచిన 'చలో ఆత్మకూరు'లో పెయిడ్‌ ఆర్టిస్ట్‌లు ఉన్నారు కాబట్టే వాళ్ల శిబిరం నుంచి కార్యకర్తలు వెళ్లిపోయారని మండిపడ్డారు. దళితుల పట్ల అమితమైన ప్రేమ కురిపిస్తోన్న చంద్రబాబు వారి ప్రభుత్వ హయాంలో ఐపీఎస్‌ అధికారిణి వనజాక్షిపై జరిగిన దాడిపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా ఎస్సైగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తోన్న మహిళను నన్నపనేని రాజకుమారి కులం పేరుతో ధూషించడం తగదని హెచ్చరించారు. ఎస్సై ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. దళితులను అవమానిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుచరిత పేర్కొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు