28.4.2020
అమరావతి
- 29వ తేదీనుంచి మూడోవిడత ఉచిత రేషన్ పంపిణీ.
- రాష్ట్ర వ్యాప్తంగా బియ్యంకార్డు వున్న 1,47,24,017 కుటుంబాలకు లబ్ది.
- కొత్తగా దరఖాస్తు చేసుకున్న 81,862 పేద కుటుంబాలకు కూడా ఉచిత రేషన్.
- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు చేయూత.
- సోషల్ ఆడిట్ తరువాత ఈ కుటుంబాలకు రైస్ కార్డుల జారీ.
- బియ్యంకార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు.
- కేంద్రప్రభుత్వ నిబంధనలతో కార్డుదారుల బయో మెట్రిక్ తప్పనిసరి
- రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు
- సరుకులు తీసుకునే ముందు, ఆ తరువాత కూడా శానిటైజ్ చేసుకోవాలి.
- భౌతికదూరంను పాటిస్తూ రేషన్ తీసుకునేందుకు టైం స్లాట్ కూపన్లు.
- రాష్ట్ర వ్యాప్తంగా 43,685 రేషన్ దుకాణాల కౌంటర్ల ద్వారా పంపిణీ
- రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాలకు అదనంగా 15,331 కౌంటర్లు
- పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్ తీసుకునే వెసులుబాటు.
లాక్ డౌన్ కారణంగా ఉపాధికి దూరమైన పేద కుటుంబాలకు అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లో మూడో విడత ఉచిత రేషన్ పంపిణీకి సర్వం సిద్దమైంది. ఈనెల 29వ తేదీ (బుధవారం) నుంచి రేషన్ దుకాణాల ద్వారా ప్రతి బియ్యంకార్డుకు కేజీ కందిపప్పు, కార్డులోని ప్రతి సభ్యుడికి అయిదు కేజీల చొప్పున బియ్యంను ఉచితంగా అందించనున్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పదమూడు జిల్లాల్లోని 28,354 చౌకదుకాణాల ద్వారా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు అందించనున్నారు. అర్హత వుండి, బియ్యంకార్డు లేని పేద కుటుంబాలకు కూడా ఉచితంగా రేషన్ అందించాలంటూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలతో కొత్తగా 81,862 కుటుంబాలకు కూడా ఉచిత రేషన్ అందించనున్నారు. అర్హత వున్న ప్రతి కుటుంబం ప్రభుత్వ సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 94,150 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై జరిగిన సర్వేలో 81,862 కుటుంబాలు రైస్ కార్డులకు అర్హత వుందని తేలింది. దీనితో ప్రస్తుతం రైస్ కార్డు వున్న కుటుంబాలతో పాటు అర్హత వున్న కుటుంబాలకు కూడా ఉచితంగా రేషన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో మూడో విడతలో మొత్తం 1.48 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే సివిల్ సప్లయిస్ అధికారులు అన్ని చౌకదుకాణాలకు బియ్యం, కందిపప్పు రవాణా చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు భౌతికదూరంను పాటించాలన్న నిబంధనల మేరకు, రేషన్ దుకాణాల వద్ద గుంపులుగా ఏర్పడకుండా వుండేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలను తీసుకుంది. కొన్నిచోట్ల రేషన్ కోసం కార్డుదారులు తొందరపడి ఒకేసారి దుకాణాల వద్దకు వచ్చిన పరిస్థితిని గమనించి ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా సమయం, తేదీతో కూడిన కూపన్లను ముద్రించింది. వాలంటీర్ల ద్వారా ఈ కూపన్లను బియ్యంకార్డుదారులకు అందిస్తున్నారు. ఈ కూపన్లపై వారికి కేటాయించిన రేషన్ షాప్ లో ఏ తేదీలో, ఏ సమయానికి వారు వెళ్ళి రేషన్ తీసుకోవచ్చో నిర్ధేశిస్తున్నారు.
*కేంద్రప్రభుత్వ నిబంధనల మేరకు బయోమెట్రిక్ తప్పనిసరి*
పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ఇస్తున్న సరుకుల విషయంలో బయోమెట్రిక్ తప్పనిసరి అంటూ కేంద్రప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల బయోమెట్రిక్ వేయాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ జాగ్రత్తలకు అనుగుణంగా రేషన్ దుకాణాల వద్ద శానిటైర్లను అందుబాటులో వుంచినట్లు సివిల్ సప్లయిస్ కమిషనర్, ఎక్స్ అఫీషియో సెక్రటరీ కోన శశిధర్ తెలిపారు. ప్రతి కార్డుదారుడు రేషన్ తీసుకునే ముందు, ఆ తరువాత కూడా రేషన్ కౌంటర్ల వద్ద చేతులను శానిటైజ్ చేసుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాగే ఎక్కువ మంది ఒకేసారి రాకుండా రెండో విడతలో ఇచ్చినట్లుగానే టైంస్లాట్ కూపన్లు కార్డుదారులకు అందచేశామని, రేషన్ ఇచ్చే గడువును కూడా పదిరోజుల పాటు పొడిగించడం వల్ల కార్డు దారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమకు నిర్ధేశించిన సమయాల్లో రేషన్ కౌంటర్ల వద్దకు వెళ్ళి ఉచిత సరుకులను పొందవచ్చని ఆయన వెల్లడించారు. అలాగే పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకునే వారు కూడా తమకు అందుబాటులో వున్న రేషన్ షాప్ నుంచి సరుకులు తీసుకునే అవకాశం వుందని అన్నారు.
రాష్ట్రంలో విజయనగరం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం రేషన్ సరుకులను డోర్ డెలివరీ ద్వారా అందిస్తోంది. మిగిలిన కరోనా ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ జోన్ గా ప్రకటించిన ఏరియాల్లో బియ్యంకార్డు దారులు సురక్షితమైన జోన్ లో సరుకులు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ లకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రేషన్ అందక, ఇతరత్రా ఇబ్బందులు వుంటే 1902 కి కాల్ చేస్తే వెంటనే అధికారయంత్రాంగం చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జిల్లా చౌకదుకాణాలు మొత్తం రైస్ కార్డులు
పశ్చిమగోదావరి 2,211 12,59,925
చిత్తూరు 2,901 11,33,535
నెల్లూరు 1,895 9,04,220
తూర్పు గోదావరి 2,622 16,50,254
కృష్ణా 2,330 12,92,937
ప్రకాశం 2,151 9,91,822
గుంటూరు 2,802 14,89,439
వైఎస్ఆర్ కడప 1,737 8,02,039
విశాఖపట్నం 2,179 12,4,5266
విజయనగరం 1,404 7,10,528
శ్రీకాకుళం 2,013 8,29,024
కర్నూలు 2,363 11,91,344
అనంతపురం 3,012 12,23,684
కొత్తగా గుర్తించిన అర్హత వున్న కుటుంబాలు : 81,862